8 July, 2026 | 12:48 AM

భాగ్యనగర గుండె కోత?

08-07-2026 12:00 AM
  1. శ్వాస నిలిపిన సాగర్.. ఇప్పుడు విషభాండం..!
  2.   460 ఏళ్ల చారిత్రక వైభవం నుంచి మురికికూపంగా మారిన వైనం.. 
  3. కాపాడుకోకపోతే నగర మనుగడకే ప్రమాదం...

హైదరాబాద్ సిటీ బ్యూరో, జులై 7 (విజయక్రాంతి): అది కేవలం ఒక నీటి సరస్సు కాదు.. భాగ్యనగర శ్వాస వ్యూహం. కోట్లాది మంది దాహార్తిని తీర్చిన అమృత భాండం. నాడు కుతుబ్ షాహీల పాలనలో నగరాన్ని సజీవంగా నిలిపిన ఆ జీవనాడి.. నేడు పాలకుల నిర్లక్ష్యం, పారిశ్రామిక వ్యర్థాలు, వాణిజ్య కబ్జాల నీడలో మూగగా రోదిస్తోంది. 1563లో నిర్మితమై, వందల ఏళ్ల పాటు నగరవాసుల గుక్కెడు నీటి కొరతను తీర్చిన హుస్సేన్సాగర్.. ఇప్పుడు కళ్లముందే కలుషితమై ‘కన్నీరు’ పెడుతోంది.

రోజుకు 20 లక్షల గ్యాలన్ల అమృతం..

హజ్రత్ హుస్సేన్ షా వలీ పర్యవేక్షణలో, ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో నిర్మితమైన ఈ చారిత్రక జలాశయం ఒకప్పుడు స్వచ్ఛతకు మారుపేరు. 1931 వరకు ఈ సాగర్ నీరే హైదరాబాద్ నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉండేది. ఒకప్పుడు రోజుకు 20 లక్షల గ్యాలన్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించిన ఈ సరస్సు, నేడు ప్రమాదకర రసాయనాలకు నిలయంగా మారింది.

చుట్టుపక్కల ప్రాంతా ల భూగర్భ జల మట్టాన్ని కాపాడటంలో, నగర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడం లో ఈ జలాశయం దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించింది. చెత్తాచెదారం.. రసాయనాల రొంపి తో హుస్సేన్ సాగర్ తన ఒలికి ప్రమాదం పొంచి ఉంది.ఒకప్పుడు పక్షుల కిలకిలరావాలు, స్వచ్ఛమైన గాలితో అలరారిన ట్యాం క్‌బండ్ ప్రాంతం.. నేడు పారిశ్రామిక, గృహ వ్యర్థాల డంపింగ్ యార్డ్గా మారిపోయింది.

జీడిమెట్ల, బాలానగర్, సనత్నగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే ప్రమాదకరమైన కెమికల్స్, బరువైన లోహాలు  నేరుగా నాలాల ద్వారా సాగర్ లోకిచేరుతున్నాయి. వీటికి తోడు నగరంలోని పదుల సంఖ్యలో ఉన్న నాలాల ద్వారా రోజూ లక్షల లీటర్ల శుద్ధి చేయని ము రుగునీరు  ఇందులో కలుస్తోంది. మరోవైపు చుట్టుపక్కల వెలుస్తున్న వాణిజ్య సముదాయాలు, ఆక్రమణల వల్ల సరస్సు వైశాల్యం క్రమక్రమంగా కుంచించుకుపోతోంది.

పర్యావరణ ప్రేమికుల హెచ్చరిక..

‘ట్యాంక్బండ్ చుట్టూ రంగుల లైట్లు, వినోద కేంద్రాలు ఏర్పాటు చేసినంత మా త్రాన సాగర్ బాగుపడదు. జలాశయం లో పల ఉన్న జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ) పూర్తిగా నశించింది. ఈ చారిత్రక సంపదను యుద్ధప్రాతిపదికన రక్షించుకోకపోతే.. భవిష్యత్తులో నగర మనుగడకే, పర్యావరణానికే తీవ్ర ముప్పు తప్పదు.‘ అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కేవలం వినోద కేంద్రమేనా..?

ప్రస్తుతం హుస్సేన్సాగర్ కేవలం పర్యాటక ఆకర్షణగా, వినోద కేంద్రంగా మాత్రమే మిగిలిపోయిం ది. విగ్రహాల నిమజ్జనాలు, లేక్ పోలీసింగ్, బోటింగ్ వంటి హడావుడి పైకి కనిపిస్తున్నా.. లోపల పేరుకుపోయిన గుర్రపుడెక్క, విషపూరిత పూడికను తొలగించే శాశ్వత చర్యలు మాత్రం శూన్యమని పర్యావరణ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి శాశ్వత పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.