16 May, 2026 | 8:58 PM

గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువకులు

16-05-2026 08:05 PM

రిహబిలేటేషన్ సెంటర్ కు తరలింపు

భద్రాచలం (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో భద్రాచలం పట్టణంలో గంజాయి అక్రమ రవాణా,గంజాయి సరఫరా చేసే వ్యక్తులపై,సేవించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం భద్రాచలం పట్టణంలో గంజాయి టెస్టింగ్ కిట్స్ ద్వారా చేపట్టిన తనిఖీలలో నలుగురు యువకులకు పాజిటివ్ రాగా,వారికి కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భద్రాచలం పట్టణంలో గల దక్షత సొసైటీ జిల్లా మత్తు పదార్థాల వ్యసన పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని సీఐ తెలిపారు.

ఇకపై భద్రాచలం పట్టణంలో విస్తృతంగా మత్తుపదార్థాలు సేవించే వారిపై గంజాయి కిట్స్ ద్వారా తనిఖీలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఎవరైనా గంజాయిని రవాణా చేస్తున్నట్లు గానీ,సేవిస్తున్నట్లు గానీ తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని కోరారు.సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కూడా వెల్లడించారు.మత్తు పదార్థాలకు బానిసలై యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని,తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.