POCSO కేసులో యువకుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
హైదరాబాద్: POCSO కేసు సంబంధించి 22 ఏళ్ల వ్యక్తికి నాంపల్లిలోని 12వ అదనపు సెషన్స్ న్యాయమూర్తి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష (RI) విధించారు. అంబర్పేట పోలీస్ స్టేషన్లో(Amberpet Police Station) నమోదైన కేసులో నిందితుడు వి. పవన్పై న్యాయస్థానం రూ. 10,000 జరిమానా విధించింది. 15 ఏళ్ల బాలికకు నిందితుడితో పరిచయం ఉందని, వారు ఫోన్ లో మాట్లాడుకునేవారని పోలీసులు తెలిపారు. వారి పరిచయం గురించి తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, నిందితుడి గురించి ఆమెను ప్రశ్నించారు.
2022 జూలై 16న మధ్యాహ్నం 3:30 గంటలకు ఆ బాలిక ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది. నిందితుడు ఆ బాలికను వివాహం చేసుకుంటానని నమ్మించి, తన ఇంటికి తీసుకువెళ్లాడు. అతను ఆమెను ఒప్పించి ఆమెతో లైంగిక సంపర్కంలో పాల్గొన్నాడు. మరుసటి రోజు బాధితురాలి తల్లి అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సెక్షన్ 180 BNS కింద వాంగ్మూలాన్ని నమోదు చేయడం కోసం ఆ ఫిర్యాదును 'భరోసా' కేంద్రానికి పంపారు.
భరోసా బృందం బాధితురాలికి, ఆమె కుటుంబానికి సహాయపడటానికి నిరంతర కౌన్సెలింగ్ సెషన్లను అందించింది. అంతేకాకుండా వారు క్రమం తప్పని ఫాలో-అప్ సెషన్ల ద్వారా నైతిక, భావోద్వేగ మద్దతును అందించారు. ఈ శిక్షా తీర్పు గురించి విని ఆ కుటుంబం అత్యంత సంతోషించింది. నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కృషి చేసిన, సమన్వయంతో వ్యవహరించిన సంబంధిత వర్గాలందరి ప్రయత్నాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ అభినందించారు.






