యూత్ కాంగ్రెస్ X బీజేవైఎం
బీజేపీ ఆఫీసును ముట్టడించిన యూత్ కాంగ్రెస్
ఆఫీసు గేట్కు నల్లరంగు పూసి.. బీజేపీ జెండా, అమిత్షా దిష్టిబొమ్మను దహనం చేసిన నాయకులు..
తీవ్ర ఉద్రిక్తత.. యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
గాంధీభవన్ ముట్టడికి బీజేవైఎం యత్నం.. అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి) : హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. మరో వైపు బీజేవైఎం ఆధ్వర్యంలో గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. దీంతో అటు బీజేపీ ఆఫీస్, ఇటు గాంధీభవన్ ఆవరణల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కబెట్టారు. ముందుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను అవమానించారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ ఆఫీసును ముట్టడించి.. ఆఫీసు మెయిన్ గేటుకు నల్లరంగు పూశారు. అక్కడనే బీజేపీ జెండాతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా దిష్టిబొమ్మను దహనం చేశారు.
దీంతో పోలీసులు జక్కిడి శివచరణ్రెడ్డితో పాటు పలువురు అందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా, వారితో వాగ్వాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏఐసీసీ చీప్ మల్లిఖార్జున ఖర్గేను అవమానించడంతో పాటు విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించిన ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి నైతిక బాధ్యత వ హించిన తన పదవికి రాజీనామా చేయాలని యువజన్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
యూత్ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనకు నిరసనగా బీజేవైఎం నాయకులు గాం ధీభవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ నెలకొన్నది. బీజేవైఎం నేతలను పోలీసులు అడ్డుకుని అదు పులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గాంధీభవన్ చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించారు. ఒక వైపు యూత్ కాంగ్రెస్, మరోవైపు బీజేవైఎం నేత లు చేపట్టిన ఆందోళనలు, నిరసనలతో కొంతసేపు ఉద్రిక్తంగా మారింది.






