20 May, 2026 | 2:14 AM

3 కార్పొరేషన్లలో మనమే గెలుస్తాం

20-05-2026 01:01 AM
  1. ఆ తర్వాత తెలంగాణలో అధికారం మనదే
  2. గతంలో ఒంటరిగా 48 స్థానాల్లో గెలిచాం
  3. ప్రజల్లో బీఆర్‌ఎస్‌కు స్థానం లేదు.. బీజేపీపైనే నమ్మకం
  4. సర్వేలు చేసి గెలిచేవారికే టికెట్లు ఇస్తాం
  5. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లను బీజేపీ గెలుస్తుందని, జీహెచ్‌ఎంసీ విజ యం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాం చందర్ రావు ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్పొరేషన్లలో విజయం సాధిస్తే ఇక తెలంగాణలో అధికారం తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

బర్కత్‌పురాలోని పార్టీ నగర కార్యాలయంలో ఎంపీ రేఖాశర్మతో కలిసి జీహెచ్‌ఎంసీ పరిధిలోని డివిజన్ అధ్యక్షు లు, పార్టీ సీనియర్ నాయకులతో రాం చందర్ రావు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఆయన పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, ఐక్యతతో బూత్ స్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ తర్వాత వార్డుల సంఖ్య 300కి పెరిగిందని, ఇంకా 350 వరకు పెరిగే అవ కా శం ఉందన్నారు.

సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉం డడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని సూ చించారు. గత 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా 48 సీట్లు గెలవడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు.

హైదరాబాద్ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరిలో బీజేపీకి బలమైన పార్లమెంట్ ప్రాతినిధ్యం ఉందని ఆయన గుర్తుచేశారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. 

కష్టపడే వారికే పార్టీ టికెట్లు..

ప్రజలతో కలిసిమెలిసి పనిచేసే కష్టపడే కార్యకర్తలకే పార్టీ టికెట్లు ఇస్తామన్నారు. గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలను అస్సలు సహించమని  రాంచందర్ రావు హెచ్చరించారు. అభ్యర్థుల ఎంపికలో సర్వేలు, ప్రజాదరణ, గెలిచే సామర్థ్యాన్ని ప్రధానంగా పరిగణిస్తామని తెలిపారు. ప్రతి వార్డులో బూత్ కమిటీలను బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. పశ్చిమ బెంగాల్‌లో.. క్రమశిక్షణతో బీజేపీ సాధించిన విజయాన్ని ఉదాహరణగా తీసుకుని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పనిచేయాలన్నారు.

తెలంగాణలో ప్రధాని మోదీ సభ భారీ విజయవంతమై కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపిందన్నారు. ప్రస్తుతం ప్రజల మనసుల్లో బీఆర్‌ఎస్‌కు స్థానం లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన అనేకమంది నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతిపాదిత మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా బీజేపీ గెలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.