ఆర్టీఏ ఆఫీసు తరలించే వరకు పోరాటం ఆపం
- ట్రాఫిక్ పద్మవ్యూహంలో శివపురి కాలనీ
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
మణికొండ, మార్చి 18 (విజయక్రాంతి) : మణికొండ శివపురి కాలనీ ప్రధాన కూడలిలో ఉన్న ఆర్టీఏ కార్యాల యం వల్ల నిత్యం ట్రాఫిక్ నరకం కనిపిస్తోందని, దానిని వెంటనే అక్కడి నుంచి తరలించాలని బీఆర్ఎస్ స్థానిక అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ డిమాండ్ చేశారు. బుధవారం కాలనీవాసులతో కలిసి చేపట్టిన శాంతియుత నిరసనలో ఆయన మాట్లాడారు.
కార్యాలయ కార్యకలాపాల వల్ల రహదారిపై వాహనాలు నిలిచిపోయి మహిళలు, వృద్ధులు, స్కూలు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆర్టీఏ ఆఫీసు వద్దు - మా కాలనీ మాకు ముద్దు‘ అంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను గట్టిగా వినిపించారు. అనంతరం ఈ సమస్యపై ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ సదానంద్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కాలనీవాసుల కష్టాలను స్వయంగా వివరించడంతో స్పందించిన డిప్యూటీ కమిషనర్.. రేపటి నుంచి ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా సెక్యూరిటీని పెంచినా, శాశ్వత పరిష్కారం కోసం కార్యాలయాన్ని తరలించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కుంబగళ్ళ ధనరాజ్, గుట్టమీది నరేందర్, అందె లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, జైరామ్, కిరణ్, భాను చందర్, రాజేంద్ర ప్రసాద్, మహిళా నాయకురాళ్లు విజయలక్ష్మి, షకీలా రెడ్డి, శ్యామలెట్ రేఖ, మంజుల, దేవిప్రియ పాల్గొన్నారు.




