18 March, 2026 | 3:32 AM

రూ.2 లక్షల రుణమాఫీ చేశాం

18-03-2026 01:52 AM

ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి):  కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, డాక్టర్ బల్మూర్ వెంకట్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టారు. రూ. 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో పూర్తి చేశామని, సన్న వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందిస్తున్నామని వారు తెలిపారు. రైతు భరోసా నిధులను ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ బలోపేతానికి రూ. 1000 కోట్లు కేటాయించామని, ప్రతి నియోజకవర్గంలో సమీకృత గురుకులాల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. పాలమూ రు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ల పునరుద్ధరణతో పాటు బాసర నుండి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 5 గ్యారంటీలు అమలు చేస్తున్నా ప్రతిపక్షాలకు కనిపించకపోవడం విచారకరమన్నారు.