05-02-2026 12:00:00 AM
15 వార్డుల్లో కాంగ్రెస్ను గెలిపిస్తేనే నిధుల ప్రవాహం: బీసీ సంక్షేమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
ఆమనగల్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి):రాష్ట్ర రాజధానికి చేరువలో ఉన్నా, గత పదేళ్ల పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆమనగల్ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమనగల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు.
వెంకటేశ్వర కాలనీ, బీసీ కాలనీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కృష్ణ నాయక్, మనయ్య, కేశవుల తరపున ఓట్లు అభ్యర్థించారు. ప్రచార సభలో మంత్రి మాట్లాడుతూ ఆమనగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇప్పటికే కేటాయించిన నిధులే నిదర్శనమని పేర్కొన్నారు. రూ. 63 కోట్ల ప్రత్యేక నిధులు, పట్టణ అభివృద్ధి కోసం ఇప్పటికే నిధులు మంజూరు చేశాం అని చెప్పారు.
పట్టణం లో 400 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, మెరుగైన వైద్యం కోసం 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. పేద విద్యార్థులకు భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా బీసీ హాస్టల్ నిర్మాణం చేపడుతున్నాం అని ఆయన తెలిపారు.
పదేళ్ల పాలనలో ’ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’...
‘గత పదేళ్లలో బీఆర్ఎస్, బీజేపీ పాలనలో ఆమనగల్ ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా కరువయ్యాయి. తాగునీరు, డ్రైనేజీ, చెత్త డంపింగ్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు‘ అని మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆమనగల్ రూపురేఖలు మార్చాలంటే 15 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
ఆమనగల్ ప్రాంతంపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ప్రత్యేక అభిమానం ఉందని, అసెంబ్లీలో సైతం ఆయన నిరంతరం ఈ ప్రాంత సమస్యల పైనే గళమెత్తుతున్నారని మంత్రి కొనియాడారు. సీఎం వద్ద ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కావాలన్నా, మరిన్ని నిధులు రావాలన్నా ప్రజల మద్దతు కాంగ్రెస్కే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి.. అభివృద్ధి చేసే చేయికి తోడుగా నిలవండి.
ఆమనగల్ను ఆదర్శ మున్సిపాలిటీగా మార్చే బాధ్యత నాది. మంత్రి వాకాటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా ఆలోచన చేసి ఓటు వేయాలని తాను మాట ఇస్తే తప్పే వాడిని కాదని ఆమనగల్ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అన్నారు. ఇప్పటికే ఆమనగల్ మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేశానని గుర్తు చేశారు.
అభివృద్ధి చేస్తామంటూ మాయమాటలు చెప్పే పార్టీలను పక్కనపెట్టి పక్కన పెట్టి... అభివృద్ధి చేసే పార్టీకి ప్రజలు అండగా నిలబడాలని ఆయన కోరారు. అనంతరం మంత్రి బీసీ కాలనీలో కమ్యూనిటీ నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని ఆయన హామీలు ఇచ్చారు, అంతకుముందు ఎమ్మె ల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి శ్రీకాంత్ కాలనీ కూడా బీసీ కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం ఐదు లక్షల మంజూరు చేస్తానని కాలనీవాసులకు హామీలు ఇచ్చారు.