ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి
ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్
ముకరంపుర,(విజయక్రాంతి) శాతవాహన విశ్వవిద్యాలయం వాణిజ్యశాస్త్ర విభాగఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కోసం చేపట్టిన “అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ – 100 రోజుల కార్యాచరణ” లో భాగంగా “కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ యూజింగ్ ట్యాలీ ఈఆర్పి 9 – ఏ స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్” అనే మూడు రోజుల శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యశాల జూలై 14 నుంచి 16 వరకు నిర్వహించబడుతోంది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్యాలీ ఈఆర్ పి 9లో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ నిర్వహణ, వోచర్ ఎంట్రీ, జీఎస్టీ అకౌంటింగ్, ఇన్వెంటరీ, పేరోల్, బ్యాంకింగ్, ఆర్థిక నివేదికలు మరియు డేటా భద్రతపై శిక్షణ ఇవ్వనున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగ శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్, విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య పి.సతీష్ కుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ వి శ్రీరంగ ప్రసాద్ లు మాట్లాడుతూ... ఆధునిక వ్యాపార రంగంలో అకౌంటింగ్ విధానాలు వేగంగా మారుతున్నాయని, విద్యార్థులు సంప్రదాయ పరిజ్ఞానంతో పాటు ట్యాలీ వంటి నూతన అకౌంటింగ్ సాంకేతికతలను తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకున్నప్పుడే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను సమర్థవంతంగా అందిపుచ్చుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ డి.హరికాంత్ కో-కన్వీనర్లు డా. కె.తిరుపతి, డా.బి.నరేష్,డా.బి. పరశురాములు, అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
End






