డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి
- డిపో ఎదుట పీడీఎస్యూ ధర్నా
ఇల్లెందు,(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రిక్వెస్ట్ స్టాప్కు బదులుగా శాశ్వత బస్ స్టాప్, బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఇల్లందు ఆర్టీసీ డిపో ఎదుట పీడీఎస్యూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ ఇన్చార్జి సునీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకుడు గంగాధర్ గణేష్ మాట్లాడుతూ... ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇల్లందు వైపు నుంచి వచ్చే విద్యార్థులను కరెంట్ ఆఫీస్ వద్ద, టేకులపల్లి వైపు నుంచి వచ్చే వారిని సుదిమళ్ల బస్ స్టాప్ వద్ద దింపుతున్నారని తెలిపారు. దీంతో విద్యార్థులు సుమారు 800 మీటర్ల నుంచి కిలోమీటరు వరకు నడిచి కళాశాలకు చేరుకోవాల్సి వస్తోందని, దాదాపు 45 నిమిషాల సమయం వృథా అవుతోందని పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థులు సమయానికి తరగతులకు హాజరు కాలేకపోతున్నారని, ముఖ్యంగా విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు పలుమార్లు వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. రిక్వెస్ట్ స్టాప్తో సరిపెట్టకుండా శాశ్వత బస్ స్టాప్, బస్ షెల్టర్ ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.






