10 March, 2026 | 9:58 PM

నిర్ణీత వేగ పరిమితితో వాహనాలు నడపాలి

10-03-2026 08:09 PM

సీఐ నాగేశ్వర రావు 

జాజిరెడ్డిగూడెం: ట్రాక్టర్ డ్రైవర్లు ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా, రోడ్డు భద్రతా నియమాలు  పాటిస్తూ నిర్ణీత వేగపరిమితితో వాహనాలు నడపాలని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కోరారు. మండల కేంద్రం అర్వపల్లిలోని సూర్యాపేట-జనగాం 365(బీ) జాతీయ రహదారిపై అర్వపల్లి ఎస్సై ఈట సైదులు ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ ఆదేశానుసారం మండల కేంద్రంలో వాహనాల తనిఖీని పటిష్టంగా నిర్వహించమన్నారు.

మండల పరిధిలోని మూసి పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ ఇసుక రీచ్ ఉండటం వల్ల ఇసుక ట్రాక్టర్లు అధికంగా తిరుగుతున్నాయని, వాటి కట్టడి కోసం స్పెషల్ డ్రైవ్ జరిపి వాహనాలకు ఉన్న సౌండ్ సిస్టం తొలగించారు. అలాగే రాత్రివేళ వాహనం కనపడే విధంగా వాహనాల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఈట సైదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.