calender_icon.png 15 February, 2026 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తనువెల్లా కనులై..

15-02-2026 05:14:21 PM

* ఉపవాస దీక్షలో ఉంటూ అమ్మ దర్శనానికి బారులు

* వనదుర్గమ్మను దర్శించి తరించిన భక్తజనం

* భక్తుల జయ జయ ద్వానాలతో మార్మోగుతున్న ఏడుపాయల క్షేత్రం

పాపన్నపేట: వాగులు, వంకలు.. కొండలు, కోనలు.. ఎల్లలు దాటి వచ్చిన లక్షలాది మంది భక్తజనంతో ఏడుపాయల వనం జనారణ్యమైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మహా జాతర ఏడుపాయల్లో అట్టహాసంగా ప్రారంభమైంది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రభుత్వం తరఫున వనదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మేళ తాళాలు, భక్తుల జయ జయ ద్వానాల మధ్య అమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి జాతరను ప్రారంభించారు.

వనదుర్గమ్మ ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నదీపాయలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహం సెట్టింగ్ జాతరకే వన్నె తెచ్చింది. వన దుర్గమ్మ దర్శనం అనంతరం భక్తులు ఈ సెట్టింగ్ వద్ద ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఆలయ పరిసరాలను పూలవనంలా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాల అలంకరణ, బంగారు కిరీటం, ముక్కుపుడక, వెండి కన్నులతో వనదుర్గామాత శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వనదుర్గమ్మను దర్శించుకుని భక్తులు తన్మయత్వానికి లోనవుతున్నారు.

మమ్మేలు మాయమ్మా.. వనదుర్గమ్మా.. చల్లంగా.. చూడమ్మా తల్లి.. అంటూ భక్తులు వేడుకుంటున్నారు. ఆలయం కొండల నడుమ రంగురంగుల ఫ్లోరోసెంట్ లైట్లు అమర్చడంతో ఆలయం ముందు గలగల పారే మంజీరా నదీ పరవళ్ళు, కొండలు, రాత్రివేళ విద్యుత్తు కాంతులతో విరాజిల్లుతున్నాయి. ఆయా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఆలయ ఈఓ వీరేశం, ఆయా శాఖలను జిల్లా, మండల అధికారులు, ఆయా పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.