24 March, 2026 | 5:59 PM

జీవన్ రెడ్డిని కలిసిన టీపీసీసీ చీఫ్

24-03-2026 04:38 PM

జగిత్యాల: కాంగ్రెస్ పార్టీని వీడాలని టి.జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC President Mahesh Kumar Goud) రంగంలోకి దిగారు. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లతో కలిసి మంగళవారం జీవన్ రెడ్డి నివాసంలో కలిసి చర్చలు జరిపారు. బీఆర్ఎస టికెట్‌పై గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక, జీవన్ రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం మంత్రులు డి. శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లను పంపించడంతో మార్చి 21న వారు ఆయనతో చర్చలు జరిపారు. మంత్రుల చర్చలతో సంతృప్తి చెందని జీవన్ రెడ్డి ఆదివారం జగిత్యాలలో తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, మార్చి 25న పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కేవలం 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున, రాష్ట్ర పార్టీ పెద్దగా మహేష్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి, తన నివాసంలో సీనియర్ పార్టీ నాయకులతో చర్చలు జరిపారు.

మరోవైపు, జీవన్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసంలోకి ప్రవేశించబోయిన జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్యను పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో, అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.  జీవన్ రెడ్డి అనుచరుడైన నందయ్య, ఇటీవల తన విధేయతను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైపు మార్చుకున్నారు. మరోవైపు, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా ధరించడానికి నిరాకరించారు. టీపీసీసీ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా, పార్టీ కార్యకర్తలు జీవన్ రెడ్డి భుజంపై కాంగ్రెస్ కండువా వేయడానికి ప్రయత్నించినప్పటికి ఆయన దానిని ధరించడానికి నిరాకరించారు.

సమావేశం అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ పోరాటం ప్రతిపక్ష శక్తులకు వ్యతిరేకంగా ఉండాలే తప్ప, తాను పార్టీలోనే కొనసాగితే సొంత శిబిరంలోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ సమస్యకు ప్రస్తుతం పార్టీ అధిష్టానానికి గానీ, తనకు గానీ ఎటువంటి పరిష్కారం కనిపించడం లేదని, ఈ పరిస్థితి కారణంగా తాను పార్టీని వీడాలని ఆలోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన భవిష్యత్తు కార్యాచరణపై బుధవారం ఉదయం స్పష్టమైన ప్రకటన చేస్తానని ప్రకటించారు.