నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
ఏర్పాట్లు పూర్తి చేశాం..
జిల్లాలో 1,81,425 మంది పిల్లలు గుర్తింపు
కలెక్టర్ ప్రతిమ సింగ్
మెదక్, జులై 12 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో సోమవారం నిర్వహించబోయే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జూలై 13 జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ( నేషనల్ డీ - వార్మింగ్ డే) సంధర్భంగా 1-19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంభందించిన ట్రైనింగ్ లను పి.హెచ్.సి.లలో పూర్తి చేశామని, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాఠశాలలు, కళాశాలలలో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవగాహన కల్పిస్తున్నారని, జిల్లాలో1-19 సంవత్సరాల పిల్లలు 181425 (లక్షా ఎనభై ఒకవేయి నాలుగు వందల ఇరవై ఐదు) వుండగా 236400 (రెండు లక్షల ముప్పు ఆరువేల నాలుగు వందల) అల్బెండజోల్ మాత్రలు సిద్ధంగా ఉంచామని, అన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడ మాత్రలను పంపించామని, ఉదయం స్కూల్ లో ప్రార్థన చేసిన తర్వాత పిల్లలకు చేతుల పరిశుభ్రత, అల్బెండజోల్ మాత్రల గురించి తెలియజేయాలన్నారు. 13వ తేదీన మాత్రలు వేసుకోని పిల్లలకు 20 న మాపప్ కార్యక్రమం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు , ఆశ కార్యకర్తలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.






