20-02-2026 11:46:27 AM
కాగజ్నగర్, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాగజ్నగర్ పట్టణంలోని ఆర్ఆర్ఓ కాలనీలో ఉన్న ఎల్లమ్మ–పొచ్చమ్మ ఆలయంలో(Yellamma Pochamma temple) తాళాలు పగలగొట్టి నగలు, నగదును అపహరించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని సందర్శించడంతో ఈ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయంలోని రెండు హుండీలను అపహరించిన దుండగులు వాటిని ఆలయ సమీపంలోని పొలాల్లో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.