విలేజ్ ఆఫీసర్ వ్యవస్థ పక్కాగా అమలు చేయాలి
జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 1 (విజయక్రాంతి):బుధవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈసందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు.కేసుల దర్యాప్తులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా, పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి, చట్టపరంగా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఆదేశించారు.
ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా విలేజ్ పోలీస్ ఆఫీసర్ వీ పి ఓ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని, గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో మమేకమై నేర నియంత్రణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులపై ఆలస్యం చేయకుండా బాధితులకు తక్షణ స్పందన ఇవ్వాలని తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, డయల్ 100 కాల్స్కు వెంటనే స్పందిస్తూ సంఘటనా స్థలానికి త్వరితగతిన చేరుకోవాలని బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ వాహన సిబ్బందిని ఆదేశించారు. పెట్రోలింగ్ సమయంలో రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు.
అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలి
పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పదిర వద్ద గల ఇసుక రీచ్ను తనిఖీ చేసి,ఇసుక తవ్వకాల విధానం,రవాణా అనుమతులు,రికార్డుల నిర్వహణపై అరా తీశారు. అక్రమంగా ఇసుక రవాణా చేసినా, నిల్వలు ఉంచినా వారిపై కేసులు నమోదు చేసి, సంబంధిత వాహనాలను సీజ్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి
నేరాల నియంత్రణకు, దొంగతనాల నివారణకు, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఎంతో అవసరమని ఎస్పీ గారు తెలిపారు.మండల పరిధిలోని గ్రామాల ప్రజలకు, వ్యాపారస్తులకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించి, విస్తృతంగా వాటి ఏర్పాటుకు కృషి చేయాలని ఆదేశించారు. ఎస్పీ వెంట ఎస్.ఐ రాహుల్ రెడ్డి ఉన్నారు.




