నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
అలంపూర్, మార్చి 27 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు విద్యార్థులకు ఎన్నో అమలు కానీ అబద్ధపు హామీలు ఇచ్చి ఆపై గద్దెనెక్కి అట్టి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, అలంపూర్ మున్సిపల్ చైర్మన్ పిండి జయరాములు నాయకులు కిషోర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఉద్యోగాల భర్తీకై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఈనెల 30న గద్వాల జిల్లా కేంద్రంలో పోరుదీక్ష కార్యక్రమం చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు.అందుకు సంబంధించిన పోరు దీక్ష పోస్టర్ శుక్రవారం అలంపూర్ పట్టణంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రతి ఏడాది క్యాలెండర్ ను పక్కాగా అమలు చేస్తామని అని అబద్ధపు హామీలు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.
విద్యార్థులకు వేలకోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్వీ ఉద్య మం ఆగదని విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విక్రమ్, నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, వెంకట్రామయ్య శెట్టి,ఆనంద్, దుబ్బన్న డేవిడ్, మధు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.




