పనుల్లో వేగం పెంచాలి
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలన
గణపురం, ఆగస్టు 4 (విజయ క్రాంతి) : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి గణపురం మండలంలోని గాంధీనగర్ శివారులో గుట్టపై నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులను భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు.పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను,గుత్తేదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుత్తేదారులతో మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలకు ఎలాంటి భంగం కలగకుండా అత్యంత బాధ్యతతో చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ విద్యా సంస్థ భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యను అందించే కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు.పాఠశాల నిర్మాణంలో నాణ్యత, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు.






