13 April, 2026 | 2:02 AM

పర్మినెంట్ అధ్యాపకులున్నా తగ్గిన ఉత్తీర్ణత శాతం..

13-04-2026 12:39 AM

ఉత్తీర్ణత శాతం పెంచడంలో విఫలమైన అధ్యాపక బృందం 

ఇంటర్ ఫలితాల్లో 55 శాతం ఉత్తీర్ణత

గతంలో 72 శాతం రాగా ప్రస్తుతం 55 శాతం

ఈసారి బడ్జెట్ పెంచిన ప్రభుత్వం

పాపన్నపేట, ఏప్రిల్12: మండల కేంద్రమైన పాపన్నపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గత ఏడాది 72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి మెరుగైన ఫలితాలను కైవసం చేసుకున్నారు. కానీ ఈ ఏడాది కేవలం 55 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. దీనితో ఉత్తీర్ణశాతం పూర్తిగా పడిపోయింది.

గత ఏడాది కళాశాలలో ఔటు సోర్సింగ్ అధ్యాపకులు ఉండగా.. ప్రభుత్వం వారిని తొలగించి పర్మినెంట్ అధ్యాపకులను నియమించినప్పటికీ ఫలితాలను రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది సెకండ్ ఇయర్ విద్యార్థులు 141 మంది పరీక్ష రాయగా 77 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో మెఘావత్ సుజాత బైపీసీ 888/1000, షాకెర ఎంపీసీ 867/1000, కుర్మ  వైష్ణవి బైపీసీ 843/1000, పి.జ్యోతి సీఈసీ 811/1000 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. అలాగే ప్రథమ సంవత్సరంలో 202  మంది విద్యార్థులు పరీక్ష రాయగా 113 మంది  విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో పి.రమేశ్ 391/470, బైపీసీ షాబొద్దీన్ 345/440, సీఈసీ జి.రఘువీర్ 320/500 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.