9 August, 2026 | 3:54 AM

లావాతో ఏర్పడిన దక్కన్ పీఠభూమి

09-08-2026 12:13 AM

ఆరు కోట్ల సంవత్సరాల కింద చల్లబడిన అగ్నిపర్వతాల లావాతో దక్కన్ పీఠభూమి ఏర్పండిందంటారు భూగర్భశాస్త్రజ్ఞులు. అప్పుడే డైనోసార్లవంటివి నశించిపోయాయని ఒక అభిప్రాయం. అయితే లభించిన డైనోసార్ల శిలాజాలు 23కోట్ల నాటివి కావడం వల్ల శిలాజ పరిణామం గురించి నిశితంగా పరిశోధనలు కొనసాగాయి. భారతదేశ ద్వీపకల్పంలో మధ్య, పశ్చిమ భారతంలో ఇంట్రాప్పియన్స్ లేదా తక్లిఫార్మేషన్ అనే క్రెటేషియస్ టెర్షియరీ సంధికాలపు అవక్షేపక్రమాలు విస్తరించాయి. దక్కన్ అగ్నిపర్వతాల విస్ఫోటనం తర్వాత పారిన లావా అడ్డంకుల వల్ల రాతిపరుపులు ఏర్పడ్డాయి. 

ఈ పురావాతావరణం చేత ఆకర్షితులైన కొందరు భూగర్భ శాస్త్రవేత్తలు 1981లో నాగపూర్, ఆసిఫాబాద్, నిజామాబాద్, వికారాబాద్ ప్రాంతాలలో ఓస్సిఫెర్రస్ స్థావరాలలో పరిశోధించారు. ప్రసాద్(1985), హోరా (1938), భాటియా, రాణా(1984)లు నాగపూర్, ఆసిఫాబాద్ లలో సవివరమైన పరిశోధనలు చేశారు. దక్కన్ బసాల్ట్ అవక్షేపాల రాతి పరుపుల గురించి భూభౌతిక, పేలియాంటలాజికల్ అధ్యయనాలు ఈస్ట్ ఇండియా కంపె నీ వారి సైనిక సర్వేల ద్వారా మొదలైనాయి. తొలి టెర్షియరీ, మీసోజాయిక్ కాలపు భూవిజ్ఞానికి వారి పరిశీలనలు తోడ్పడ్డాయి. 

ఏకకణ, ద్వికణ శిలాజాలపై పరిశోధన

ఇంటర్ ట్రాప్పియన్ వేదికల్లో ఏకకణ, ద్వికణ శిలాజాల మీద కౌల్తార్డ్ (1934) పరిశోధించాడు. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ తోవలో మేడికొండ, బజార్ హత్నూర్, ఇచ్చోడ మొదలైన చోట్ల ‘యూనిక్ దక్కనెన్సిస్’ శిలాజాలు, మంగపేట ప్రాంతంలో ‘పలుదినా దక్కనెన్సిస్’ శిలాజాలను (గెద్దెస్) కనుగొన్నారు. వీటన్నింటి గురించి అందరి కంటె ముందుగా మాల్కంసన్ 1833లోనే నివేదికలు రాసాడు. మహరాష్ట్ర, తెలంగాణ నేలల్లో ప్రవహించే ప్రాణహిత-గోదావరి లోయల్లో 1.2 నుంచి 5 మీ.ల లోతున సూక్ష్మ సకశేరుకాల శిలాజాలు లభించాయి.

గడిచిన 5 దశాబ్దాలుగా జియోలాజికల్ స్టడీస్ యూనిట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ కలకత్తా సంస్థలు ఈ నదీలోయల్లో అన్వేషిస్తున్నారు. జీఎస్‌ఐ వారు 150 ఏండ్లుగా ఈ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్నారు. 1861లోనే కింగ్ ఇక్కడి స్తరీకృత భూభౌతికపటం తయారుచేసాడు. ప్రాణహిత, గోదావరి లోయల్లో ఇన్ఫ్రా కామ్తి, ఎర్రవల్లి, మలేరి, ధర్మారం, కోట అడవుల్లో సరీసృపాల శిలాజాలు లభించాయి. 

* ఎర్రవల్లిలో జైన్, రాం చౌధురి (1987), బంధోపాధ్యాయ(1968) శిలాజప్రాంతాలను కనిపెట్టారు.

* మలేరిలో రైంకోసార్, సైనోడాంట్, చేపల(సమృద్ధిగా) శిలాజాలు దొరికాయి.

* మంచిర్యాల జిల్లాలో సారిశ్రీ్చన్ డైనోసార్ అనే ప్రాథమిక డైనోసార్ శిలాజం లభించింది.

* మలేరిఫార్మేషన్ లో మీసోజాయిక్ కాలం నాటి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు(7రకాలు) దొరికాయి.

* ధర్మారం అడవిలో ఆర్కోసార్ శిలాజాలు లభించాయి.

ఇండియా టుడే(16-31 మే 1979) పత్రికలో కోటాఫార్మేషన్‌లో ‘ఫాజిల్ బర్డ్’ను జిఎస్‌ఐ, హైద్రాబాద్‌కు చెందిన పొన్నాల యాదగిరి కనుగొన్నట్టు వార్త వచ్చింది. అది అతిపురాతనమైన ఆర్కియోప్టెరిక్స్ అని పక్షి శిలాజం. యాదగిరి క్యూహ్నోథెరిడ్ సైమ్మోంట్రోడాంట్స్ కు చెందిన ‘త్రిశూలో థెరియం, ఇండో థెరియం’లను కూడా కనిపెట్టాడు.

వేమనపల్లి ప్రాంతంలో ప్రసాద్ ఆధ్వర్యంలో 3 ఏండ్లపాటు జరిపించిన తవ్వకాల వల్ల 20 కోట్ల నుంచి 12 కోట్ల సంవత్సరాల కిందటి డైనోసార్ల అవశేషాలు లభించాయి. 1974 నుంచి 1980ల మధ్య వేమనపల్లి నుంచి 840 డైనోసార్ల అవశేషాలు సేకరించబడ్డాయి. డైనోసార్ల అవశేషాలతో పునర్నిర్మించిన డైనోసార్ అస్ఠిపంజరం హైద్రాబాద్ లోని బిర్లా ప్లానెటోరియంలోని ‘డైనోసారియం’లో వుంది. దీని పేరు ‘కోటాసారస్ యామనపల్లిన్సిస్’. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో అర కిలోమీదరు విస్తీర్ణంలో సిరోంచ దగ్గర వడధామ్ ఫాసిల్ పార్కు వుంది. డైనోసార్లకు సమకాలీనమైనవి, 20-15 కోట్ల సంవత్సరాల వయస్సున్న వృక్షశిలాజాలను ఈ పార్కులో ప్రదర్శనకు వుంచారు. కాబ్గేట్ అనే శాస్త్రవేత్త, మొహబీ అనే రిటైర్డ్ జిఎస్‌ఐ అధికారి ఈ శిలాజాల మీద పరిశోధనలు చేసారు. 

తెలంగాణ చరిత్రబృందం అన్వేషణ

2014లో తెలంగాణ చరిత్రబృందం ఆసిఫాబాద్ బెజ్జూరు మండలంలోని కొండపల్లి అడివిలో 15 ఎకరాల్లో విస్తరించిన వృక్షశిలాజాల ప్రదేశాన్ని గుర్తించింది. వీటి వయస్సు కాబ్గేట్, మొహబీల నివేదికల ప్రకారం 15కోట్ల సం.ల నుంచి 6.5కోట్ల సం.ల వయస్సు వుంటుంది. 2019 ఏప్రిల్ నుంచి జూన్ మొదటి వారాంతం వరకు తెలంగాణ చరిత్రబృందం వేమనపల్లి, రాజారం, చెన్నూరు,జైపూర్, బుగ్గ, కాటారం ప్రాంతాలలో జరిపిన ఉపరితల అన్వేషణలో విరివిగానే శిలాజ శకలాలు లభించాయి. వాటిలో డైనోసార్ ఎముకల శిలాజశకలాలు, మానవ శిలాజం, ఆకుల శిలాజాలు, షెల్ శిలాజాలను శాస్త్రవేత్తల, చరిత్రకారుల సహాయంతో గుర్తించగలిగింది. ఇంకా గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని బుగ్గగుట్ట ప్రాంతంలో శిలాజాల పెంకులు

* మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని రాజారం పరిసరాల్లో డైనోసార్ల ఎముకల శిలాజాలు

* పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో శిథిల శిలాజం(?)

* మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో (డైనోసార్?) పాదం అచ్చు శిలాజం. 1990లో ఇక్కడ నుంచే మానవశిశు శిలాజాన్ని జిఎస్‌ఐ, హైద్రాబాద్ వారు తీసుకువెళ్ళారట. అట్లే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం నుంచి డైనోసార్ పూర్తి శిలాజాన్ని సేకరించి, జిఎస్‌ఐ హైద్రాబాద్ కార్యాలయ ప్రాంగణంలో భద్రపరిచారు.

* మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్ర సమీపంలోని అడివిలో పత్రశిలాజాలను గుర్తించడం.

ఈ సందర్భంలోనే నీల్వాయి వాగు మీద కట్టిన బ్రిడ్జి రివిట్మెంట్ వాల్ మీద పరిచిన రాళ్ళల్లో శిలాజాల వంటివి కనిపించడంతో వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లకు, పేలియాంటాలజిస్టులకు వాటి ఫోటోలు పంపి, మాట్లాడి, సమాచార సేకరణ చేయడం జరిగింది. డైనోసార్లు, చేపలు, పత్రా లు, మానవ శిలాజ సమృద్ధమైన వేమనపల్లి వంటి ప్రదేశాలను గుర్తించి, అక్కడక్కడ లభించే శిలాజాలను సేకరించి, పరీక్షించి, నిర్ధారించి... వేమనపల్లిలో ఒక శిలాజప్రదర్శనశాల ఏర్పరిస్తే బాగుంటుందని తెలంగాణ ప్రాక్చరిత్రను పరిరక్షించుకోవచ్చని చరిత్రబృందం భావిస్తున్నది.