రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
ఇంధన కొరత లేదు... తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు
పెట్రోల్ కొరత లేదని ప్రకటించిన తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్
హైదరాబాద్: తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్(Telangana Petroleum Dealers Association) ఇంధన కొరత లేదని ప్రకటించింది. హెచ్ పీసీఎల్, ఐవోసీఎస్, పీబీసీఎల్ వద్ద తగినంత స్టాక్ ఉందని ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. ఇంధన కొరత ఉందన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ఇంధనం దొరకదనే భయంతో బంకులకు క్యూ కడుతున్నారని అసోషియేషన్ సభ్యులు తెలిపారు.
ముందస్తు కొనుగోళ్లతో ఇబ్బంది ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు. సాధారణ విక్రయాల కంటే దాదాపు మూడు రెట్లు పెరిగాయని అసోసియేషన్ ప్రకటించింది. సోషల్ మీడియాలో వదంతులతో వాహనదారులు ఆందోళన చెంద వద్దని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ , డీజిల్ దొరకదనే ఆందోళనతో అధిక మోతాదులో కొనుగోలు చేయవద్దని కోరారు. క్యాన్లు డ్రమ్ముల్లో పెట్రోల్, డీజిల్ కొని స్టాక్ పెట్టుకోవద్దని తెలిపారు.
పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ
జంట నగరాల్లోని పలు పెట్రోల్ బంకుల వద్ద బుధవారం ఉదయం నుంచి భారీ రద్దీ నెలకొంది. వాహనదారులు తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి పోటెత్తారు. తమ భవిష్యత్తు అవసరాల కోసం పెట్రోల్ నింపుకునేందుకు, కొందరు ప్లాస్టిక్ డ్రమ్ములు, భారీ ఉక్కు పాత్రలతో వచ్చారు. రద్దీగా ఉండే బేగంపేట రోడ్డు, బంజారా హిల్స్, ఫలక్నుమా సమీపంలోని కాళీ మందిర్ ఇతర ప్రాంతాల్లోని ఇంధన కేంద్రాల వద్ద భారీ రద్దీ కనిపించింది. బంజారా హిల్స్లోని పెట్రోల్ బంక్ దగ్గర రెండు కిలోమీటర్ల మేర వాహనాల క్యూ కనిపించడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి, వాహనదారులు లోపలికి ప్రవేశించకుండా నిరోధించాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని తెలియజేసినప్పటికీ, వాహనదారులు మాత్రం భారీ పరిమాణంలో ఇంధనాన్ని నింపుకోవడం కొనసాగించారు.





