ఏజెన్సీలో తీజ్ ఉత్సవాలకు శ్రీకారం
ఉట్నూర్, ఆగస్టు 27 ( విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో లంబాడా గిరిజనులు శ్రావణమాసంలో ఘనంగా నిర్వహించే తీజ్ ఉత్సవాలకు తండాలలోని లంబాడీ గిరిజన బాలికలు శ్రీకారం చుట్టారు. గురువారం లంబాడా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయంగా పంట చేనులకు వెళ్లి భూమి పూజ చేసి మట్టిని తాండ నాయక్ ఇంటికి మట్టిని తీసుకువచ్చారు. తీసుకొచ్చిన మట్టిని వెదురు గుళ్ళలో నింపి గోధుమ విత్తనాలను చల్లారు.
తీజ్ ఉత్సవాల సందర్భంగా శ్రీ కృష్ణాష్టమి వరకు ప్రత్యేక పూజలు చేసి ఉదయం సాయంత్రం గోధుమ విత్తనాలు మొలకెత్తే విధంగా నీరు పోస్తూ ఆటపాటలు సాగిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాలతోపాటు జిల్లాలోని వివిధ మండలాల్లోని లంబాడా తండాలో తీజ్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇంద్రవెల్లి మండలంలోని హార్కాపూర్ తాండా గ్రామ నాయక్ చవాన్ ఉమాజీ, కారో వారి దూదురాం జాదవ్, గ్రామ సర్పంచ్ రాథోడ్ రోహిదాస్ ఆధ్వర్యంలో తండాలోని బాలికలు మట్టిని తీసుకువచ్చి నాయక్ ఇంటి వద్ద వెదురు గుళ్ళలో మట్టిని నింపి గోధుమ విత్తనాలు చల్లారు.






