విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అమానుషం
చిన్నారిని చితకబాదిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని వెల్లువెత్తుతున్న డిమాండ్
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): తిర్యాణి మండలం లింగిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి దూర ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్న ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులను తరచూ వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల ఓ చిన్నారిని తీవ్రంగా కొట్టడంతో అతని శరీరంపై దద్దుర్లు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, గ్రామస్తులు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయుడిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించాల్సి ఉంది.




