ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
ఆదిలాబాద్,(విజయక్రాంతి): రైతు బిడ్డగా తనకు రైతుల సమస్యలపై అవగాహన ఉందని వారి సమస్యలను పరిష్కరించేలా తన వంతుగా పూర్తి కృషి చేస్తానని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ తన్వీర్ అహ్మద్, సభ్యులుగా సోమన్న, మోతిబాయి, నవీన్ రెడ్డి, ప్రభాకర్, ధనుంజయ్, చంద్రశేఖర్ రెడ్డి, పొశెట్టి, అశోక్, దివాకర్, సురేష్, ప్రకాష్ రెడ్డి, గణేష్ లతో కూడిన పాలకవర్గాన్ని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం మార్కెట్ యార్డులో నూతన పాలకవర్గ సభ్యులతో కలిసి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, రైతులు నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యులకు పుష్పగుచ్ఛాలు అందించి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు వచ్చి పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యత అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రైతుల సంక్షేమం కోసం పెద్ద పీఠ వేస్తుందని, ఆ దిశాగానే స్వయంగా ఓ రైతు అయిన తనను చైర్మన్ గా నియమించిందని పేర్కొన్నారు. దీంతో రైతుల కష్టాలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని వాటిని పరిష్కరించేందుకు తమ పాలకవర్గం కృషి చేస్తుందన్నారు. తనకు చైర్మన్ గా నియమించినందుకు కృషి చేసిన సీఎం, డిప్యూటి సీఎం, ఇన్చార్జి మంత్రి, టీపీసీసీ అధ్యక్షులతో పాటు జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






