సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ రాశారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్న హడావిడి చాలు అని, ఇక వాస్తవాలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, తెలంగాణ ప్రజలకు నిజం తెలిసే హక్కు ఉందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని దెబ్బతిన్న మూడు బ్యారేజీల పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవ్వడాన్ని, ఆ ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.
కాళేశ్వరం పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను త్వరలో పునరుద్ధరించాలని రామచందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు నష్టపోతున్నారని, కరువు కాలంలో గోదావరి నీటిని వాడుకోలేక నష్టపోతున్నామని తెలిపారు. ఎన్డీఎస్ఏ నివేదికల అమలులో అలసత్వం చేస్తున్నారని, బ్యారేజీలను పునరుద్ధరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కేంద్రం నియమించిన కమిటీపై నెపాన్ని నెట్టి తప్పించుకోవద్దని రామచందర్ రావు వెల్లడించారు.






