ముంబైలోని తాజ్ హోటల్కు బాంబు బెదిరింపు కాల్
ముంబయి: ముంబయిలోని తాజ్ మహల్ హోటల్ పేల్చివేస్తామంటూ ఆగంతకులను బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అర్ధరాత్రి సుమారు 12:13 గంటలకు ఒక వ్యక్తి నవీ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి, దావూద్ తాజ్ హోటల్లో బాంబు పెట్టినట్లు సమాచారం అందించాడు. దీంతో ఈ సమాచారం వెంటనే ముంబై పోలీస్ ప్రధాన కంట్రోల్ రూమ్కు చేరవేశారు. దుండగుడి నుంచి వచ్చిన బాంబు బెదిరింపు కారణంగా కొలాబా పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, బాంబు గుర్తింపు, నిర్వీర్య దళం (BDDS) బృందాలు తాజ్ హోటల్కు చేరుకుని భద్రతా తనిఖీలను చేపట్టాయి.
హోటల్ ప్రధాన లాబీ, స్విమ్మింగ్ పూల్, విందు హాళ్లు, రెస్టారెంట్లు, పార్కింగ్ ప్రాంతం, బయటి ఆవరణ, ఇతర కీలక ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఆ ప్రాంగణంలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు గానీ, పేలుడు పదార్థం గానీ లభించలేదని పోలీసులు ధృవీకరించారు. అనంతరం ఆ బెదిరింపు బూటకమని తేలిందని పోలీసులు ఆదివారం తెలిపారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చందనే దానిపై పోలీసులు ఆరా తీయగా, నవీ ముంబైలోని తుర్బే ప్రాంతం నుండి వచ్చినట్లు తేలింది. ఆ కాల్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ నంబర్ ఆధారంగా, కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితుడిని గుర్తించి పట్టుకునేందుకు అధికారులు తుర్బే పోలీసులతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు.






