ఎస్ఆర్ యూనివర్సిటీకి ఐసీఏఆర్ గుర్తింపు
వరంగల్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): వరంగల్లోని ఎస్ఆర్ యూనివర్సిటీ మరో ముఖ్యమైన మైలురాయి సాధించింది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) నుంచి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ ప్రోగ్రామ్ రెండింటికీ గుర్తింపు లభించింది.
ఈ గుర్తింపుతో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్కూల్/కాలేజ్ ప్రోగ్రామ్ స్థాయిలలో ఐసీఏఆర్ గుర్తింపు పొందిన తొలి ప్రైవేట్ యూనివర్సిటీగా ఎస్ఆర్ యూనివర్సిటీ నిలిచింది. ఈ గుర్తింపు 16 మార్చి 2026 నుంచి ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఈ నిర్ణయం నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడిటేషన్ బోర్డ్ (ఎన్ఏఈఏబీ) 42వ సమావేశంలో నిర్ణయం తీసుకోబడింది. ఈ సందర్భంగా ఎస్ఆర్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఎ. వరదారెడ్డి మాట్లాడుతూ, ఈ విజయానికి సహకరించిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను అభినందించారు.
వ్యవసాయ రంగంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలపై విశ్వవిద్యాలయం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమన్నారు. ఈ గుర్తింపు ద్వారా స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్,సంబంధిత కోర్సుల ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. ఐసీఏఆర్ గుర్తింపు పొందిన డిగ్రీలు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతాయి. విద్యార్థులు ఐసీఏఆర్ స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అర్హత పొందుతారు. అదేవిధంగా విశ్వవిద్యాలయానికి నిధులు, పరిశోధన అవకాశాలు లభిస్తాయి. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ తన సందేశంలో, ఈ గుర్తింపు విశ్వవిద్యాలయ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఐసీఏఆర్ నిబంధనలు, డీన్స్ కమిటీ సిఫారసుల ప్రకారం సిలబస్ రూపొందించబడిందని తెలిపారు.
స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డీన్ ప్రొఫెసర్ జి భూపాల్ రాజ్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంలో 13 ఆధునిక ప్రయోగశాలలు, వ్యవసాయ భూములు, పోలీహౌస్, షేడ్నెట్, హైడ్రోపోనిక్స్ ,వాతావరణ పరిశీలన కేంద్రం వంటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కాగా ఎస్ఆర్ యూనివర్సిటీ ప్రముఖ వ్యవసాయ సంస్థలు,అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో 25కు పైగా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.వి రమణరావు, డీన్ ఆపరేషన్స్ అండ్ గ్రోత్ ప్రొఫెసర్ ఆర్చనా రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీవీ రాజశేఖర్, ఐక్యూఎసీ ప్రతినిధులు, అధ్యాప కులు తదితరులు పాల్గొన్నారు.






