కల్తీ పెరుగు, కోవా తయారీ కేంద్రంపై ఎస్ఓటీ దాడి..
జవహర్ నగర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): కాప్రా సర్కిల్ పరిధిలోని వైష్ణవి ఎన్క్లేవ్లో ఓ మిల్క్ సెంటర్లో కల్తీ పెరుగు, కోవా తయారు చేస్తున్న కేంద్రంపై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా 120 కిలోల కల్తీ పెరుగు, 6 కిలోల కోవాను తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి తయారీ, గడువు తేదీలు, లేబుళ్లు లేకుండా పెరుగు, కోవా తయారు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు ఎస్ఓటీ ఎస్ఐ. సాయికుమార్ తెలిపారు. తనిఖీల్లో సుమారు వెయ్యి కిలోల పెరుగు, 50 కిలోల కోవా నిల్వ ఉన్నట్లు గుర్తించామన్నారు.
పెరుగు, కోవా నమూనాలను ఆహార భద్రతాధికారులకు పంపించామని, పరీక్షల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో కల్తీ పెరుగు కల్తీ పదార్థాలు పట్టుకున్నారని వైరల్ కావడంతో మళ్లీ రంగంలోకి దిగిన ఎస్ఓటి పోలీసులు దాడి చేసి 120 కిలోల కల్తీ పెరుగు. 50 కిలోల కల్తీ కోవాను పట్టుకొని జవహర్ నగర్ ఎస్ఓటి పోలీసులకు అప్పగించారు.
అక్రమంగా దొంగ చాటున నడుపుతున్న మిల్క్ సెంటర్ ను ఎస్ఓటి పోలీసులు సీజ్ చేసి మిల్క్ సెంటర్ యజమానిని జవహర్ నగర్ ఎస్ ఓ టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మిల్క్ సెంటర్ లో గత కొంతకాలంగా కల్తీ పదార్థాలను తరలిస్తూ ప్రముఖ బ్రాండ్ల పేరుమీద చలామణి చేస్తూ కల్తీ వస్తువులకు ఆద్యం పోస్తున్నాడు. మిల్క్ షాప్ యజమాని కల్తీ వస్తువులు అమ్ముతూ ప్రజల ప్రాణాల పాలిట యమ శాపాలుగా మారారని, ఇకపై కల్తీ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు.






