కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు!
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు మరో ఆసక్తికర చిత్రంతో రాబోతున్నారు. హీరో సందీప్ కిషన్తో ఓ భారీ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీని చేయబోతున్నట్టు వారు శనివారం ప్రకటించారు. ఈ మేరకు కాన్సెప్ట్ పోస్టర్ను సోషల్మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టర్లో యుద్ధభూమి బ్యాక్గ్రౌండ్లో సింహం, తోడేలు మధ్య ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ అలా నిటారుగా నిల్చుని ఉంది.
‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు’ అంటూ ఈ పోస్టర్కు ఇచ్చిన క్యాప్షన్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన ప్రేక్షకులే లక్ష్యంగా ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. షైనింగ్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.




