12 August, 2026 | 10:49 PM

సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు !

12-08-2026 09:03 PM

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి కలెక్టర్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

సీఎం పర్యటన రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, హెలిప్యాడ్, సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.

హెలిప్యాడ్ నుంచి సీఎం ప్రయాణించే మార్గం, సభా వేదిక, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్, రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పటిష్టమైన భద్రతా ప్రణాళికను అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, సీఎం రూట్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ప్రాంతాల్లో భద్రతా చర్యలను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.