ఎస్ఐఆర్ ఫారాలు వెంటనే సమర్పించాలి
మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్
మొయినాబాద్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్వోలకు లేదా వార్డు కార్యాలయాల్లో వెంటనే సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ సూచించారు. జిల్లా కలెక్టర్ (ఈఆర్ఓ) ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఆన్లైన్ ప్రక్రియ జూలై 12న కూడా యథావిధిగా కొనసాగనున్నట్లు తెలిపారు.
ఇంటింటికి వచ్చే బీఎల్వోలకు ఫారాలను అందజేయడం లేదా వార్డు కార్యాలయంలో సమర్పించడం ద్వారా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. గడువు సమీపిస్తున్నందున ఫారాలను సరైన వివరాలతో నిర్ణీత సమయంలో సమర్పించని పక్షంలో ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, తద్వారా ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు.






