26 May, 2026 | 3:16 AM

ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు అస్తవ్యస్తం

26-05-2026 01:38 AM

‘రైతు గోస, బీజేపీ భరోసా’లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు

కేసముద్రం, మే 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు మండిపడ్డారు.తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘రైతు గోస , బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం కేసముద్రం మండలంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.

కేసముద్రం ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్న రైతులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వల్లభు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే నిరీక్షించాల్సి రావడం దుర్మార్గమన్నారు. ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే గొనె సంచుల కొరత, రవాణా (లారీల) సమస్య వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తూకాల్లో జరుగుతున్న మోసాలపై, తరుగు పేరుతో క్వింటాలుకు చేస్తున్న కటింగ్లపై అక్కడి అధికారులను ఆయన నిలదీశారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని ధ్వజమెత్తారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కనీసం తాగడానికి మంచినీటి సౌకర్యం లేదని, నీడ కోసం టార్పాలిన్లు, షెడ్లు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పొదిల నరసింహ రెడ్డి, కేసముద్రం మండల శాఖ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, మండల మున్సిపలిటి కన్వీనర్ బోగోజు నాగేశ్వర చారి, మంగిశెట్టి నాగన్న, మల్యాల రాములు, పోలేపల్లి సంపత్ రెడ్డి, బానోత్ రాము, వేం సుదీష్ , కేసముద్రం మండల బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.