5 July, 2026 | 7:16 PM

జులై 7న శీతల పండుగను ఘనంగా జరుపుకోవాలి

05-07-2026 06:05 PM

శీతల పండుగకు ప్రభుత్వ సెలవు ప్రకటించాలి

సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య నాగు నాయక్

చివ్వెంల,(విజయక్రాంతి): బంజారా గిరిజనుల ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచిన శీతల (శిత్ల్) పండుగను జులై 7న అన్ని తాండాల్లో ఘనంగా నిర్వహించాలని సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య నాగు నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెద్ద పూసల కార్తీలో వచ్చే మొదటి మంగళవారం నిర్వహించే శిత్ల్ పండుగ బంజారా గిరిజనుల తొలి సంప్రదాయ పండుగ అని తెలిపారు. ప్రాచీన కాలం నుంచి పశుసంపద అభివృద్ధి చెందాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా కురవాలని ప్రార్థిస్తూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.

యావత్ గిరిజన బంజారా సోదర సోదరీమణులు ఈ ఏడాది జులై 7న ఒకేరోజు శీతల పండుగను ఘనంగా నిర్వహించి జాతి ఐక్యతను చాటాలని కోరారు. ప్రభుత్వం ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు శీతల పండుగకు ప్రభుత్వ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి తాండాలో లంబాడి గిరిజనులు సంప్రదాయాలను పరిరక్షిస్తూ శాంతియుత వాతావరణంలో శీతల పండుగను ఘనంగా నిర్వహించాలని భూక్య నాగు నాయక్ కోరారు.