షబ్బీర్ x చంద్రశేఖర్
- గాంధీభవన్కు చేరిన కామారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ
- టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు
- చంద్రశేఖర్రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ
హైదరాబాద్, జూన్ 4(విజయక్రాంతి) : కాంగ్రెస్లో అంతర్గత విభేదాలకు కొదువలేదు. పాలకుర్తి నియోజక వర్గ పంచా యితీ ముగియకముందే.. ఇప్పుడు కామారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ గాంధీభవన్కు చేరింది. మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఆ పార్టీ సీనియ ర్ నేత గడ్డం చంద్రశేఖర్రెడ్డి వర్గాల మధ్య వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇరువర్గాల నాయకులు టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
గత వారం రోజుల క్రితం షబ్బీర్అలీ వర్గానికి చెందిన కొంత మంది నాయకులు చంద్రశేఖర్రెడ్డిపైన టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన చంద్రశేఖర్రెడ్డి.. పార్టీకి సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ, షబ్బీర్అలీపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అతనిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీంతో గడ్డం చంద్రశేఖర్రెడ్డికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి షోకాజ్ నోటీసు ఇవ్వగా, పది రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
ఇప్పుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీపైన చంద్రశేఖర్రెడ్డి వర్గీయులు పీసీసీ క్రమశిక్షణ కమిటీ
చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఆధ్వర్యంలో దాదాపు 40 మంది కార్యకర్తలు వచ్చి ఫిర్యాదుచేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడానికి మాజీమంత్రి షబ్బీర్అలీనే కారణమని, పార్టీ కోసం పనిచేసినా సీనియర్లను పక్కన పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.
కామారెడ్డిలో షబ్బీర్అలీ వల్లే పార్టీ బలోపేతం కావడంలేదని, ఎమ్మెల్యేగా ఇప్పటివరకు ఏడుసార్లు పోటీచేసిన షబ్బీర్అలీ కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచారని పేర్కొన్నారు. కామారెడ్డిలో పార్టీ బలోపేతం చేయడంలేదని, తన ఇంటినే పార్టీ ఆఫీసుగా చేసుకుని పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని చంద్రశేఖర్రెడ్డి వర్గం ఫిర్యాదు చేసింది.
పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరాం : మల్లు రవి
కామారెడ్డిలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని, వాటిపైన విచారణ చేస్తామని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి తెలిపారు. పార్టీ నేత చంద్రశేఖర్రెడ్డిపైన గత వారం రోజుల క్రితం కామారెడ్డి నియోజక వర్గంలోని మండల పార్టీ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారని, అందుకు చంద్రశేఖర్రెడ్డికి నోటీసు ఇచ్చి.. పది రోజుల్లో సమాధానం చెప్పాలని సూచించామన్నారు.
చంద్రశేఖర్రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారని తెలిపారు. చంద్రశేఖర్రెడ్డికి మద్దతుగా కూడా కొందరు నాయకులు గాంధీభవన్కు వచ్చి వినితిపత్రం ఇచ్చారని మల్లు రవి చెప్పారు. వినతిపత్రం పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.






