06-02-2026 08:29:01 PM
- రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని
- మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
- హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం గురువారం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉండాలని, పోలింగ్ కేంద్రం బయట కూడా సీసీ కెమెరా ఉండేలా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కు సంబంధించి బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్, ఇతర సామగ్రి ఏర్పాట్లపై సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీశారు. ఈ నెల 16వ తేదీన వార్డ్ సభ్యులు, కార్పొరేటర్లతో ముందుగా ప్రమాణ స్వీకారం చేయించాలని వివరించారు.
ఫారం 1, 2, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ ఆఫిషియో ఓటు హక్కు తదితర అంశాలపై తెలిపారు. అనంతరం ఇన్ డైరెక్ట్ ఎలక్షన్ లో భాగంగా మున్సిపల్ చైర్మెన్, మేయర్ ఎలక్షన్ నిబంధనల ప్రక్రారం గెజిటెడ్ అధికారుల సమక్షంలో నిర్వహించాలని ఆదేశించారు. కోరం లేక వాయిదా పడితే 17వ తేదీన నిర్వహించాలని తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకూ మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
67 వార్డుల్లో ఎన్నికలు
జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో మొత్తం 67 వార్డులు ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ పూర్తి అయిందని, మిగితా బ్యాలెట్ పేపర్ సిద్దం అవుతుందని వివరించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో పూర్తి చేసామని తెలిపారు. సిరిసిల్ల జోనల్ ఆఫీసర్లు, ఆర్ఓ, ఏఆర్ఓలు, పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చామని, శుక్రవారం వేములవాడ లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ నెల 7 వ తేదీన మైక్రో అబ్జర్వర్ లకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను ఎస్పీతో కలిసి పరిశీలించామని వెల్లడించారు. ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఇన్ డైరెక్ట్ ఎలక్షన్ ఎస్ఈసీ నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్. ఎన్నికల అధికారి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.