ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన సర్పంచ్
ధర్మపురి,మే7(విజయక్రాంతి): వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలకు గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కూడా గ్రామాభివృద్ధి పనుల్లో కష్టపడి పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి ఆరోగ్యం గురించి పలు సూచనలు చేశారు.
ఎండల సమయంలో ఎక్కువగా నీరు తాగాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా పిల్లల చదువుపై దృష్టి పెట్టాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇంటి ముందు చెత్త వేయకుండా గ్రామ పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.గ్రామ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం గ్రామ పంచాయితీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ స్రవంతి, పాలకవర్గ సభ్యులు బొడ్డు రమేష్,ఫీల్డ్ అసిస్టెంట్ పోతరాజుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.






