ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె
మధిర, ఏప్రిల్ 16(విజయ క్రాంతి): ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం సమ్మెకు సిద్ధం కావాలని ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ నాయకులు యావత్ కార్మికలోకానికి పిలుపునిచ్చారు. గురువారం మధిర డిపో గేటు సమావేశంలో జేఏసీ నాయకులు పాల్గొని ప్రభుత్వ, యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేపదే విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం కార్మికులను సమ్మె మార్గంలోకి నెట్టిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే, అన్ని సంఘాలను ఐక్యం చేసి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి సమ్మెను తీవ్ర స్థాయిలో చేపడతామని స్పష్టం చేశారు. కార్మికుల ఐక్యతే మా బలం, మా పోరాటమే మా హక్కుల సాధనకు మార్గమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు పాటి అప్పారావు, అరుణ కుమారి, రామచంద్ర రావు, తిమ్మినేని రామారావు, మధిర డిపో జేఏసీ నాయకులు నాగుల్ మీరా, వెంకటేశ్వర్లు, గోపాల రావు, రహీమ్, భాస్కరరావు, శ్రీను, జమలయ్య, కొండలరావు, శ్రీనివాసరావు, కాలేషా తదితరులు పాల్గొన్నారు.






