12-02-2026 12:00:00 AM
పెనుబల్లి (మండాలపాడు), ఫిబ్రవరి 11, (విజయక్రాంతి): రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నీలాద్రేశ్వరి ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మండాలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గాయం రమేష్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులు చేపట్టారు.
బుధవారం నాడు ఆయన స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ, మండాలపాడు నుండి ఎరుగట్ల వరకు ఉన్న ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను నరికించి రహదారిని సుందరీకరించారు.
అదేవిధంగా, గుంతలమయంగా మారిన రోడ్డుకు అత్యవసర మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాయం రమేష్ మాట్లాడుతూ.. ‘నీలాద్రేశ్వరి ఆలయ పుణ్యక్షేత్రానికి శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
భక్తుల ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పనులను ముందస్తుగా పూర్తి చేశాం. పంచాయతీ పరిధిలో భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం‘ అని తెలిపారు. సర్పంచ్ చొరవతో రోడ్డు పనులు పూర్తి కావడం పట్ల స్థానిక గ్రామస్తులు మరియు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.