విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అన్నారు, ఈనెల 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా,జూన్ 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (International Day Against Drug Abuse and Illicit Trafficking) సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు,ఎస్సై చంద్రకుమార్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో ఉండటం అభినందనీయమని అన్నారు.విద్యార్థుల్లో మంచి విలువలు, క్రమశిక్షణ ఉన్నప్పుడు వారు ఎప్పటికీ మత్తు పదార్థాల బారిన పడరని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని సూచించారు. తమ గ్రామాలు, కాలనీలు, పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ ‘యాంటీ డ్రగ్ సోల్జర్స్’గా ముందుండాలనిపిలుపునిచ్చారు.
మత్తు పదార్థాలు మొదట్లోఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, తరువాత అవి వ్యసనంగా మారి వ్యక్తి ఆరోగ్యం, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయనిహెచ్చరించారు.మాదకద్రవ్యాల వల్ల శారీరక,మానసిక సమస్యలు తలెత్తడంతో పాటు కుటుంబాలు కూడాఇబ్బందులుఎదుర్కొంటాయని తెలిపారు.అందువల్ల విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనిసూచించారు.పాఠశాల ప్రాంగణాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని,అలాగే సమాజంలో ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర శ్రమతోనే ఉన్నతాధికారులు, క్రీడాకారులు, కళాకారులు, నాయకులుగా ఎదగగలరని అన్నారు.లక్ష్యంపై దృష్టి సారించి కృషి చేస్తే ప్రతి విద్యార్థి జీవితంలో విజయాన్ని సాధించగలడని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు, పెద్దపల్లి నార్కోటిక్ టీం ఇన్స్పెక్టర్ రాజ్కుమార్,ఎస్సై చంద్రకుమార్, జూలపల్లి ఎస్సై మల్లేష్ ఎలిగెడు ఎస్ఐ మధుకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.






