పాఠశాలల బంద్ సంపూర్ణం
- విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి
- ఎబీవీపీ సిద్దిపేట జిల్లా ఎస్ఎఫ్డి కన్వీనర్ భీమగోని చరణ్
కోహెడ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ పిలుపు మేరకు మంగళవారం మండల కేంద్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలను బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి జిల్లా ఎస్ ఎఫ్ డి కన్వీనర్ భీమగోని చరణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కులు, నాణ్యమైన విద్య కోసం ఏబీవీపీ నిరంతరం పోరాటం చేస్తుoదన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు బంద్కు సహకరించడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






