ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన
ఏన్కూర్,(విజయక్రాంతి): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున మండల వ్యాప్తంగా ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరై నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల పోచారం పాఠశాల నందు జరిగిన నిరసన ప్రదర్శనలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డీఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ... ప్రభుత్వం వెంటనే పిఆర్సీని ప్రకటించాలని, పెండింగ్ డీఏలను,బిల్లులను విడుదల చేయాలి.
సక్రమంగా హెల్త్ కార్డులను అమలు చేయాలని, గురుకుల,కేజీబీవీ, యుఅర్ఎస్,మోడల్ స్కూల్స్,ఎయిడెడ్, గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని, పండిట్స్, పిఈటి పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ పదోన్నతులు కల్పించాలని, టిఆర్టి ల సర్వీస్ ను క్రమబద్ధీకరించాలని గిరిజన సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పదోన్నతుల బదిలీల షెడ్యూల్ ను విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలకు నష్టదాయకంగా ఉన్న జీవో 25ను సవరించాలని కోరారు.ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.






