ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో మండల రిసోర్స్ పర్సన్ ల మూడు రోజుల జిల్లా స్థాయి సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ కె. హరిత ప్రారంభించి శిక్షణ మాడ్యూళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఉపాధ్యాయులే విద్యా వ్యవస్థకు మూలస్తంభాలని, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ప్రాథమిక విద్య ద్వారానే ఏర్పడుతుందని అన్నారు. ప్రతి చిన్నారిలో చదవడం, రాయడం, గణించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధనా విధానాలు, విద్యార్థి కేంద్రిత అభ్యాస పద్ధతులు, సమగ్ర బోధన విధానాలను ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, నాణ్యమైన విద్య అందించేందుకు నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు.
ఈ శిక్షణలో మండల రిసోర్స్ పర్సన్లకు బోధనా నైపుణ్యాల పెంపు, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN), సమగ్ర బోధన, అభ్యసన ఫలితాల అంచనా, వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థుల సామర్థ్యాల అభివృద్ధి వంటి అంశాలపై నిపుణులు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ఎంఆర్పీలు తమ మండలాల్లోని ఉపాధ్యాయులకు మార్గదర్శకులుగా వ్యవహరించి విద్యా ప్రమాణాల పెంపునకు తోడ్పడాలని కలెక్టర్ ఆకాంక్షించారు.జూలై 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఎంపికైన మండల రిసోర్స్ పర్సన్స్ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి, క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, కోర్స్ ఇన్చార్జి అడే ప్రకాష్, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్లు, వివిధ మండలాల ఎంఆర్పీలు పాల్గొన్నారు.






