ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): 19 సంవత్సరాలలోపు వయసు ఉన్న ప్రతి ఒక్కరూ ఆల్బెండజాల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 19 సంవత్సరాల లోపు పిల్లలు, యుక్త వయసు ఉన్న వారందరికీ నులిపురుగు నివారణ మాత్రలు అందించాలని, ఈ మాత్రలు తీసుకోవడం ద్వారా పిల్లలలో నులిపురుగులను నివారించవచ్చని, పోషణ మెరుగుపడుతుందని, ఆరోగ్యకర ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. తద్వారా పిల్లలు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై చదువుపై దృష్టి పెరుగుతుందని, మంచి భవిష్యత్తుకు సహాయపడుతుందని తెలిపారు. ఆల్బెండజోల్ కు మాత్రలు విద్యార్థులకు అందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతిరోజు రుచికరంగా భోజనాన్ని అందించడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారంగా ఆహారాన్ని అందించాలని, ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులను వినియోగించాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన అందించాలని, పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి నాగేంద్ర, వైద్య సిబ్బంది, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






