పిట్టంపల్లి గ్రామంలో పరిశ్రమల కాలుష్యంపై కలెక్టర్కు వినతి
13-07-2026 05:44 PM
చిట్యాల,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. గ్రామ పరిసరాల్లో ఉన్న స్థానిక పరిశ్రమల నుంచి గత కొన్ని రోజులుగా తీవ్రమైన కాలుష్యం వెలువడుతోందని, దట్టమైన పొగ, దుర్వాసన, ధూళి కారణంగా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలుష్యం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు.






