16-02-2026 08:00:07 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ ఎన్.రవిలు వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు 89 అర్జీలను అందజేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను సంబంధిత శాఖల అధికారులు, తహసిల్దార్లను తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, డిఆర్డిఓ మేన శ్రీను, సిపిఓ సత్యనారాయణరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.