భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో సీఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో మంగళవారం సుల్తానాబాద్ పట్టణ పరిధిలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో భద్రతా ఏర్పాట్లు, బ్యాంకుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకుల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు, స్ట్రాంగ్ రూమ్ భద్రత, ఫైర్ సేఫ్టీ పరికరాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం, నగదు రవాణా సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించడం వంటి అంశాలపై బ్యాంకు మేనేజర్లకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఖాతాదారులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని, బ్యాంకు భద్రతకు సంబంధించిన అన్ని ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ రంజిత్ రావు, ఎస్ఐ చంద్రకుమార్, పోలీసు సిబ్బంది మరియు సుల్తానాబాద్ పట్టణంలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు , అధికారులు పాల్గొన్నారు.






