విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి
– ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థులు
ఉట్నూర్,(విజయక్రాంతి): విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని, ఓటు హక్కు విలువను చిన్న వయస్సులోనే తెలుసుకోవడం బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విజయ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామంలో గల కళాశాలలో మంగళవారం విద్యార్థి కౌన్సిల్ ఎన్నికలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, నిర్ణయాత్మక సామర్థ్యం, ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఎన్నికలను నిర్వహించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా అలంకరించగా, విద్యార్థులు వరుసలో నిలబడి తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించారు. ఓటు వేసిన అనంతరం ఇంకు గుర్తును చూపిస్తూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాళ్లు ఎంకవ్వ, ప్రియాంక ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. పీవోగా మాధవి, ఏపీవోగా ప్రియాంక, ఓపీవోగా ఎంకవ్వ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించారు.
ఎన్నికలు ప్రశాంతంగా, క్రమశిక్షణతో సాగగా విద్యార్థులు వివిధ కౌన్సిల్ పదవులకు తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయ మాట్లాడుతూ, ప్రతి ఓటు విలువైనదేనని, సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించవచ్చన్నారు. ఇటువంటి ఎన్నికలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు, సిబ్బందిని, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను ఆమె అభినందించారు.






