ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!
కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటివరకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 4 నుంచి ఆర్డీవో కార్యాలయాల్లో కూడా నిర్వహించనున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఇకపై జిల్లా స్థాయితో పాటు రెవెన్యూ డివిజనల్ అధికారి స్థాయి (ఆర్డీఓ కార్యాలయాలలో) కూడా నిర్వహించడం జరుగుతుందని,
జిల్లాలోనీ మహబూబాబాద్ డివిజన్ (మహబూబాబాద్ పట్టణం) తొర్రూరు డివిజన్ (తొర్రూరు ఆర్డీవో కార్యాలయంలో) ఇకపైన ప్రతి సోమవారం ఉదయం 10.30 నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఇట్టి ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అన్ని డివిజనల్ స్థాయి విభాగాల డివిజనల్ అధికారులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. సంబంధిత డివిజన్, మండలాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం దరఖాస్తులను వారి సమీపంలో గల రెవెన్యూ డివిజనల్ అధికారి ఆఫీసులో కూడా సమర్పించ వచ్చునని, తగు రసీదు ను పొందవచ్చునని కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.






