ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణులతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సిర్పూర్ - టి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన మంగెన భూదేవి తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
దహేగాం మండల కేంద్రానికి చెందిన భుతే దేవేందర్ తమ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణం పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేస్తారు. ఆసిఫాబాద్ మండలం కౌటగూడ గ్రామానికి చెందిన గెడం పద్మ తన భర్త మరణించినందున జాతీయ కుటుంబ ప్రయోజన పథకం క్రింద ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. సిర్పూర్ - టి మండల కేంద్రంలోని రైల్వే కాలనీకి చెందిన గాదె సుభద్ర తనకు గృహజ్యోతి పథకం క్రింద రాయితీ వర్తింపజేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన దుర్గం కావేరి తన పిల్లలకు గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీకి చెందిన చాపిడి సరోజ తనకు మున్సిపాలిటీలోని మెప్మా విభాగంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా ఉపాధి కల్పించాలని కోరుతూ ఆర్ జి సమర్పించారు.
దహేగాం మండలం ఐనం గ్రామానికి చెందిన కొట్లూరి దుర్గా గౌడ్ తాను సాగు చేస్తున్న ప్రభుత్వ భూమిని పట్టా చేసి పాసుపుస్తకం జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.






