కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు
- ఈశ్వరమ్మ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు
- యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు
- జక్కిడి శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం
- ఎల్బీనగర్ లో భగ్గుమన్న బీసీ సంఘాలు
- విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో,
- శివచరణ్ రెడ్డి ఇంటి ముట్టడి, పోలీసుల లాఠీఛార్జ్
- క్షమాపణ చెప్పకపోతే గాంధీ భవన్ ముట్టడిస్తాం
ఎల్బీనగర్, జులై 13 : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి బీసీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆడియో క్లిప్ లు బయటి రావడంతో బీసీ సంఘాల భగ్గుమన్నాయి. ముఖ్యంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలైన ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ కు చెందిన ఈశ్వరమ్మ యాదవ్ ను అసభ్యం వ్యాఖ్యలు చేశారని బీసీ సంఘాల నాయకులు ఆరోపించారు. ఈశ్వరమ్మకు మద్దతుగా యాదవ, పద్మశాలి, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు సోమవారం మన్సూరాబాద్ డివిజన్ లోని ఈశ్వరమ్మ ఇంటి వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేసి, శివచరణ్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం శివచరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ క్రమంలో శివచరణ్ రెడ్డి, ఈశ్వరమ్మ మద్దతుదారుల మధ్యన రాళ్లదాడి చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరువర్గాలను లాఠీఛార్జ్ చేసి, చెదరగొట్టారు. ముందుగా జరిగిన సమావేశంలో బీసీ సంఘాల నాయకులు మాట్లాడారు.
- ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో బేషరతుగా క్షమాపణ చెప్పాలి
బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్రవర్ణాల దురహంకారానికి నిదర్శనమన్నారు. రెడ్డి నాయకులు బీసీ నాయకులను రాజకీయంగా ఎదగకుండా మానసికంగా, పార్టీపరంగా వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే జక్కిడి శివచరణ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టి పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. వృద్దురాలైన సీనియర్ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ కు సీఎం రేవంత్ రెడ్డి చిన్న నామినేటెడ్ పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓసీ నాయకుడు ఓర్వలేరా? అని ప్రశ్నించారు. మహిళలపట్ల గౌరవాన్ని పాటించాలని సూచించారు. ఈశ్వరమ్మ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో 10 కి.మీ భారీగా ట్రాఫిక్ జామై వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.






